టీమిండియా యువ క్రికెటర్, ఓపెనర్ ఇషాన్ కిషన్ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ యువ ఓపెనర్ వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. విషయం ఏమిటంటే? 2022లో ఇషాన్ ఇదే రోజున జరిగిన మూడో వన్డేలో అద్భుత ద్విశతకాన్ని నమోదు చేశాడు. అప్పటికే గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్.. 126 బంతుల్లో 200 పరుగులు చేసి, వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసినవాడిలా తన పేరిట రికార్డులు నమోదు చేసుకున్నాడు.

అవును, వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన 4వ భారత క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతకు మునుపు ఈ రికార్డ్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ అయితే అత్యధికంగా 3 సార్లు డబుల్ సెంచరీ బాదడం విశేషం. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్.. ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 50 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి, ఆ తర్వాత చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొడితే సిక్స్ లేదంటే ఫోర్ అన్నట్టుగా రెచ్చిపోయి మరీ ఆడాడు. అలా మొత్తానికి 126 బంతుల్లో ఇషాన్ డబుల్ సెంచరీ నమోదు చేయడంతో తన పేరుని చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఆఖరికి 131 బంతుల్లో 210 పరుగులు చేసిన ఇషాన్.. తరువాత ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి, వెనుదిరిగాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లో.. బంగ్లాదేశ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన క్రికెటర్‌గా కూడా ఇషాన్ రికార్డ్ క్రియేట్ చేయడం చాలా అరుదైన విషయంగానే పరిగణించాలి. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద మొదట శిఖర్ ధావన్ (3) ఔట్ కాగా.. విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులుపెట్టించిన ఇషాన్.. రెండో వికెట్‌కు ఏకంగా 290 పరుగులు జోడించి క్రికెట్ క్రీడాభిమానులను ఉత్సాహాన్నిచ్చాడు. అందులో దాదాపు 200 పరుగులు ఇషాన్ చేసినవే కావడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: