క్రికెట్ అభిమానులకు అలర్ట్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ వివరాలు వచ్చేసాయి. పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు ఏకంగా 2.24 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.20.8 కోట్లు ప్రైజ్ మనీ దక్కనుంది. ఇది గత ఎడిషన్ (2017)తో పోలిస్తే 53 శాతం ఎక్కువ కావడం విశేషం. మొత్తం ప్రైజ్ పూల్ అయితే 6.9 మిలియన్ డాలర్లు. పాకిస్థాన్ గడ్డపై 1996 తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మేజర్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఇది కావడంతో మరింత క్రేజ్ నెలకొంది.

రన్నరప్‌గా నిలిచిన జట్టుకు కూడా భారీగానే ముట్టజెప్పనుంది ఐసీసీ. రన్నరప్ జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.10.4 కోట్లు ప్రైజ్ మనీ అందుతుంది. సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన రెండు జట్లకు కూడా ఒక్కొక్కరికి రూ.5.2 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ లభిస్తుంది. టోర్నీలో 5వ, 6వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.3 కోట్ల 25 లక్షలు, 7వ, 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1 కోటి 30 లక్షలు ప్రైజ్ మనీగా దక్కుతాయి. టోర్నీలో పాల్గొనే ప్రతీ జట్టుకు కనీసం 1 కోటి 16 లక్షలు గ్యారంటీగా దక్కుతాయి.

గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు గెలిస్తే అదనంగా బోనస్ కూడా ఉంది. ప్రతి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ గెలిచిన జట్టుకు 34,000 డాలర్ల కంటే ఎక్కువ మొత్తం లభిస్తుంది. ఒకవేళ ఏదైనా టీమ్ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచి ఛాంపియన్‌గా నిలిస్తే, గెలిచిన ప్రైజ్ మనీ, పార్టిసిపేషన్ మనీ, గ్రూప్ స్టేజ్ విజయాలు అన్నీ కలిపి మొత్తం రూ.22 కోట్ల వరకు కొల్లగొట్టొచ్చు.

ప్రైజ్ మనీ భారీగా పెంచినా, ఇవి ఐపీఎల్ ఆటగాళ్ల జీతాలతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పాలి. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.23.75 కోట్లకు తిరిగి కొనుక్కుంది. ఐపీఎల్‌లో ఒక్క ప్లేయర్ జీతంతో పోలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ మొత్తం ప్రైజ్ మనీ దాదాపు సమానంగా ఉండటం విశేషం.

రెండు వారాల పాటు జరగనున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికల్లో జరుగుతాయి. ఎనిమిది జట్లు పోటీ పడుతుండగా, రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: