ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా అన్ని విధాలా సన్నద్ధమైంది. దుబాయ్ వేదికగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సమరం మొదలుకాబోతోంది. ఈ సారి ఎట్టి పరిస్థితితుల్లోనూ ఛాంపియన్స్ గానే భారత్ లో అడుగుపెట్టాలని టీమిండియా మంచి పట్టుదల మీద ఉంది. వన్డే వరల్డ్ కప్ - 2023లో ఫైనల్ వరకూ భారత్ ను తీసుకెళ్లిన రోహిత్ శర్మ, ఆ తరువాత తన కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా దక్కించుకోవాలని భారత్ ధృడనిశ్చయంతో ఉంది. ఇటీవల ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. అదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు రెడీ అయిపోయింది.

ఈ ట్రోఫీలో భాగంగా గురువారం (ఫిబ్రవరి 20) భారత్ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుందనే విషయం విదితమే. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ గురించి భారత మాజీ క్రీడాకారుడు మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో భారత్ విఫలమైనా రోహిత్ శర్మ కెప్టెన్సీకి వచ్చిన నష్టమేమీ లేదు! అని ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా మహమ్మద్ కైఫ్ మాట్లాడాడు. ఎందుకంటే రోహిత్ శర్మ ఇంకా చాలా కాలం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 2027 వన్డే ప్రపంచ కప్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత్ ఆడనుందని మహమ్మద్ కైఫ్ జోశ్యం చెప్పడం గమనార్హం.

ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మపైన అభిమానులు ఎడిట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ వరకు వచ్చిన టీమిండియా ఫైనల్ లో ఓడిపోవడం దగ్గరనుండి, ఆ తరువాత తన కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకొని.. కమ్ బ్యాక్ ఇవ్వడాన్ని బాగా ఎడిట్ చేసి చూపించారు. కెజిఫ్ సినిమా ఎలివేషన్లతో సాగే సదరు వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సమయం వచ్చిందని కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రోహిత్ తన బ్యాటింగ్, కెప్టెన్సీతోనే సమాధానం ఇచ్చి అందరి నోళ్లను మూయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: