ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది నిజమే. ఆరు వికెట్ల తేడాతో ఇండియా విన్ అయ్యింది. దీంతో గ్రూప్-A పాయింట్ల పట్టికలో పాక్ పాతాళానికి పడిపోయింది. వరుసగా రెండు ఓటములు. అభిమానుల గుండెల్లో దడ పుట్టించింది. ఇక పాకిస్తాన్ కథ ముగిసిందా, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్టేనా, సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ లేదా? అంటే ఉంది, ఇంకా ఉంది.

పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశం ఇంకా మిగిలే ఉంది. అయితే, అది అంత సులువు కాదు. చాలా సమీకరణాలు కలవాలి. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత ఇండియా మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ పాక్ తేలిపోయింది.

ఇండియాతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్ ఒక్కడే కాస్త పోరాడి 62 పరుగులు చేశాడు. కెప్టెన్ రిజ్వాన్ కూడా 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.

ఇక బౌలింగ్‌లో అయితే మరీ దారుణం. ఇండియా బ్యాటర్లు పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. తన 51వ వన్డే సెంచరీతో ఇండియాను గెలిపించాడు. షాహీన్ అఫ్రీది రెండు వికెట్లు తీసినా.. ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా ఒక్కో వికెట్ పడగొట్టారు. కానీ ఫలితం లేకపోయింది. ఇండియా ఈజీగా టార్గెట్‌ను ఛేజ్ చేసింది. 45 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు పాకిస్థాన్ భవితవ్యం వాళ్ల చేతుల్లో లేదు. సెమీస్‌కు వెళ్లాలంటే.. ముందుగా ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. అంతే కాదు, మిగతా మ్యాచ్‌ల ఫలితాలు కూడా పాకిస్థాన్‌కు అనుకూలంగా రావాలి. అప్పుడే ఏదైనా జరుగుతుంది.

ఇక్కడ కీలకం ఏంటంటే.. ఫిబ్రవరి 24న బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే.. పాకిస్తాన్ ఇంటికి వెళ్లినట్టే. అప్పుడు ఇండియా, న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్తాయి. కానీ.. బంగ్లాదేశ్ గనుక న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. పాకిస్థాన్‌కు ఇంకా ఆశలు ఉంటాయి. అప్పుడు పాకిస్థాన్ ఫిబ్రవరి 27న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. ఆ తర్వాత మార్చి 2న జరిగే ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఇండియా గెలవాలి.

ఇలా జరిగితే.. పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. మూడూ రెండేసి పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్‌కు ఏ జట్టు వెళ్తుందో నిర్ణయిస్తారు. ఇండియా మాత్రం అప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

గ్రూప్-A లో మిగిలిన మ్యాచ్‌లు:

ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి

ఫిబ్రవరి 27: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి

మార్చి 2: న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్

పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఈ మూడు జరగాల్సిందే.

ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ గెలవాలి.

ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ గెలవాలి.

మార్చి 2న న్యూజిలాండ్‌పై ఇండియా గెలవాలి.

ఇవి జరిగితేనే నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. అప్పుడు పాకిస్తాన్‌కు సెమీస్ ఛాన్స్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: