రోహిత్ శర్మ సేన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి అదరగొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టింది. న్యూజిలాండ్ పెట్టిన 252 పరుగుల టార్గెట్‌ను కేవలం 4 వికెట్లు కోల్పోయి, ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే కొట్టేసింది మన టీమ్. దీంతో ఇండియా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఇంతకుముందు 2002, 2013లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి రికార్డు సృష్టించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఇండియాకు ప్రైజ్ మనీగా అక్షరాలా 2.24 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 19.45 కోట్లు దక్కాయి. ఇంత పెద్ద టోర్నీ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ, ఐపీఎల్ వేలంలో ఒక్కో ప్లేయర్‌కు వచ్చే డబ్బుతో పోలిస్తే చాలా తక్కువ.

పంజాబ్ కింగ్స్ టీమ్ శ్రేయాస్ అయ్యర్‌ను ఏకంగా 26.75 కోట్లకు కొనేసింది. రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ అయితే ఏకంగా 27 కోట్లు పెట్టి కొనేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అతడు టాప్ కాస్ట్ ప్లేయర్. వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ టీమ్ 23.75 కోట్లకు కొని వైస్ కెప్టెన్‌గా కూడా చేసింది.

రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 1.12 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 9.72 కోట్లు దక్కాయి. సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా టీమ్స్‌కు చెరో 560,000 డాలర్లు అంటే 4.86 కోట్లు ఇచ్చారు. 5, 6 స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్స్‌కు 350,000 డాలర్లు అంటే 3.04 కోట్లు ఇచ్చారు. పాకిస్థాన్, ఇంగ్లాండ్ 7, 8 స్థానాల్లో నిలవడంతో ఆ జట్లకు 140,000 డాలర్లు అంటే 1.21 కోట్లు ఇచ్చారు.

గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో మ్యాచ్ గెలిస్తే 34,000 డాలర్లు అంటే 29.5 లక్షలు ఇచ్చారు. టోర్నీలో పాల్గొన్న ప్రతి టీమ్‌కు కనీసం 125,000 డాలర్లు అంటే 1.08 కోట్లు ఇచ్చారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ పూల్ 6.9 మిలియన్ డాలర్లు అంటే 59.9 కోట్లు. 2017 ఎడిషన్‌తో పోలిస్తే ఇది 53% ఎక్కువ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: