
ఇక ఈ కార్యక్రమంలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ కోహ్లీ, ఆర్సీబీ మహిళల టీమ్ కెప్టెన్ స్మృతీ మందాన పాల్గొని తమ తమ భావాలు పంచుకున్నారు. ఆర్సీబీ కొత్త శకం మొదలైందని, ఇక నుంచి తమకు అన్నీ విజయాలేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ లోగోతో పాటు కొత్త జెర్సీని ఆర్సీబీ ఫ్రాంచైజీ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో కోహ్లీ ఎంట్రీతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. 'కింగ్ కోహ్లి' అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే తనను కింగ్ అని పిలవొద్దని హోస్ట్ డానిష్ సైత్, అభిమానులను కోహ్లీ కోరారు. కింగ్ అని పిలిపించుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నాడు.
కాగా దీని గురించి డు ప్లెసిస్తో కోహ్లీ మాట్లాడడం జరిగింది. తనను కింగ్ అని పిలవడం మొదట మానాలని సూచించారు. నన్ను కింగ్ పదంతో పిలవొద్దని నేను ఫఫ్ డు ప్లెసిస్తో చెప్పానని కూడా కోహ్లీ ఈ సందర్భంగా అన్నాడు. తనను అలా పిలిచిన ప్రతిసారి ఇబ్బందిగా అనిపిస్తుందన్నాడు. కాబట్టి తనను విరాట్ అని పిలవాలని.... దయచేసి ఇక నుంచి తనను పిలవడానికి కింగ్ పదాన్ని ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తొలి మ్యాచ్లోనే కొదమ సింహాల పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.