రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొట్టి, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా భువీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు.

మ్యాచ్‌లో భువీ తన నాలుగు ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, డేంజర్‌గా మారుతున్న తిలక్ వర్మ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకవేళ తిలక్ క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఆర్‌సీబీ చేతుల్లోంచి జారిపోయేది.

భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు 179 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 184 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 161 మ్యాచ్‌లలో 183 వికెట్లు తీశాడు. దీంతో, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువీ మూడో స్థానానికి చేరుకున్నాడు. యజువేంద్ర చాహల్ (162 మ్యాచ్‌లలో 206 వికెట్లు), పియూష్ చావ్లా (192 మ్యాచ్‌లలో 192 వికెట్లు) మాత్రమే అతని కంటే ముందున్నారు.

మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్‌సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 67), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37) కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి ముంబై బౌలర్లను చితక్కొట్టారు.

వీరిద్దరూ ఔటయ్యాక, రజత్ పటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 32 బంతుల్లో 64 పరుగులు చేశాడు. జితేష్ శర్మ 19 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా ఆర్‌సీబీ భారీ స్కోరు 221/5 ను నమోదు చేసింది.

ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 45 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్ కూడా 2 వికెట్లు తీసినప్పటికీ 57 పరుగులు సమర్పించుకున్నాడు. విఘ్నేష్ పుతూర్ ఒక వికెట్ పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా తన నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ వికెట్ మాత్రం దక్కించుకోలేకపోయాడు.

222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తొలుత తడబడింది. 12 ఓవర్లలో 99/4తో కష్టాల్లో పడింది. కానీ, తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) కలిసి 89 పరుగుల భాగస్వామ్యంతో ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ భారీ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను ఆర్‌సీబీకి చేరువ చేశారు.

చివరి ఓవర్లలో ఆర్‌సీబీ బౌలర్లు విజృంభించారు. కృనాల్ (4/45), జోష్ హేజిల్‌వుడ్ (2/37), భువనేశ్వర్ (1/48) కీలకమైన వికెట్లు తీసి ముంబై పరుగులను కట్టడి చేశారు. దీంతో ఆర్‌సీబీ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: