
ఈ మ్యాచ్లో ధోనీ మళ్లీ కెప్టెన్గా వచ్చాడు. టీమ్ కష్టాల్లో పడింది. 11 ఓవర్లు అయ్యేసరికి 65 పరుగులకే 4 వికెట్లు పోయాయి. ఇక్కడ టీమ్కి ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడు కావాలి. ఇన్నింగ్స్ను చక్కదిద్దే సత్తా ఉన్న ధోనీ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ధోనీ మాత్రం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇంపాక్ట్ ప్లేయర్ దీపక్ హుడాను ముందు పంపించాడు. ధోనీ బ్యాటింగ్కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. CSK ఊపు తగ్గిపోయింది.
విష్ణు విశాల్ ఎక్స్ ద్వారా తన అసహనాన్ని బయటపెట్టాడు. తాను కూడా క్రికెటర్ కావడంతో చాలా కాలం మౌనంగా ఉన్నానని, కానీ ధోనీ ఇంత ఆలస్యంగా బ్యాటింగ్కు రావడం "దారుణం" అనిపించిందని అన్నాడు. "ఏ క్రీడైనా గెలవడానికి ఆడరా?" అని ప్రశ్నించాడు. ఇప్పుడు మ్యాచ్లు "సర్కస్"లా అనిపిస్తున్నాయని విమర్శించాడు. "క్రీడ కంటే ఏ ఒక్క వ్యక్తి కూడా గొప్ప కాదు" అంటూ ఘాటుగా పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ధోనీ వయసు 43 ఏళ్లు. మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. అందుకే బ్యాటింగ్కు ఆలస్యంగా వస్తున్నాడని CSK మేనేజ్మెంట్ చెబుతోంది. కానీ టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీ ముందు రావాల్సింది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
మ్యాచ్ తర్వాత ధోనీ మాట్లాడుతూ.. తక్కువ స్కోర్ చేశామని ఒప్పుకున్నాడు. "కష్టమైన బంతులను ఎలా ఆడాలో తెలుసుకోవాలి" అని చెప్పాడు. టీమ్ మళ్లీ బేసిక్స్కు వెళ్లాలని సూచించాడు.
CSK 20 ఓవర్లలో కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. KKR ఈ లక్ష్యాన్ని 10.1 ఓవర్లలోనే 107/2 స్కోరుతో సునాయాసంగా ఛేదించింది. CSK తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 15న లక్నో సూపర్ జెయింట్స్తో జరగనుంది.