
కట్ చేస్తే, సీఎస్కే లక్నోను వారి సొంత ఇలాకాలో (అటల్ బిహారీ వాజ్పేయ్ స్టేడియం) చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించింది. ఈ క్రమంలోనే... ఈ మ్యాచ్లో కనబరిచిన అద్భుత ప్రదర్శనకు గానూ ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డుని నమోదు చేశాడు. కాగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునే సమయానికి ధోని వయసు 43 ఏళ్ల 282 రోజులు కావడం గమనార్హం. ధోనికి ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది. ప్రవీణ్ విషయానికొస్తే... 42 ఏళ్ల 200 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2014 సీజన్లో అబుదాబీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ప్రవీణ్ ఈ ఘనత సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) ముక్కిమూలిగి ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడు మాత్రమే రాణించాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. మంచి దూకుడుగా ఆడింది. అయితే ఓ దశలో ఒకింత తడబడింది. శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని సత్తా చాటడంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ధోని, దూబే ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్కేను గెలిపించారని చెప్పుకోవచ్చు. సీఎస్కే విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైనప్పుడు.. దూబే, ధోని జోడీ శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి దూబే బౌండరీ బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు.