నేలపై ప్రయాణం అందరూ చేస్తారు.. కానీ ఆకాశంలో ప్రయాణం మాత్రం కొందరికే సాధ్యం .. ఎందుకంటే అది చాలా ఖరీదు కదా. విమానం ఎక్కాలంటే టికెట్ ధర కనీసం వేలల్లో ఉంటుంది. అయితే.. ఇప్పుడు గాల్లో ప్రయాణం కూడా చౌక కాబోతోంది. ఎంత చవక అంటే.. కేవలం రూ. 12 ఖర్చు చేస్తే చాలు.. గాల్లో ప్రయాణించవచ్చు.. అవును.. మీరు చదువుతున్నది నిజమే.. కాకపోతే.. అది అందుబాటులోకి రావాలంటే కాస్త సమయం పడుతుంది మరి.


అయితే  ఈ ప్రయాణం విమానంలోనో.. హెలికాప్టర్ లోనో కాదు సుమా.. ఇదో కొత్త తరహా ప్రయాణం.. ఇక నగరాల్లో 4 సీట్ల డ్రోన్లు నడిపేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లో ‘ఈవీటోల్స్‌’ సేవలు అందుంచేందుకు జెట్‌ సెట్‌ గో ఏవియేషన్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ కనికా టేక్రివాల్‌ వివరించారు. ఈ సంస్థకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈ స్టార్టప్‌లో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, పారిశ్రామికవేత్త పునీత్‌ దాల్మియా కూడా పెట్టుబడులు పెట్టారట.


ఈ జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ సంస్థ తన విస్తరణ కార్యకలాపాల కోసం నిధులు సమీకరిస్తోంది. కనీసం  రూ.1500 కోట్ల నిధులు సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం  ఈవీ టోల్స్‌ సేవలు అందించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ భారీ డ్రోన్లలో పైలట్‌ అంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం కెమేరా డ్రోన్లు ఎలా పని చేస్తున్నాయో.. ఇవీ అలాగే.. కాకపోతే ఇవి సైజ్‌లో భారీగా ఉంటాయన్నమాట. ఈ భారీ డ్రోన్లలో ఒకేసారి నలుగురు ప్రయాణించే సదుపాయం ఉంది. వీటినే ఈవీ టోల్స్‌ అంటున్నారు.


ఈ భారీ డ్రోన్లను ఓసారి ఛార్జింగ్‌ చేస్తే  40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చట. అంటే ఒక కిలోమీటరుకు ఒక్కో వ్యక్తికి రూ.12 ఖర్చు అవుతుందట. ఇదేదో బావుంది కదా. ఎయిర్‌బస్‌ వంటి కొన్ని సంస్థలు ఈ డ్రోన్లను తయారు చేస్తున్నాయి. వీటి సేవలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: